సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
దస్తూరాబాద్, డిసెంబరు 1: ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమష్టి గా ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ సింగరి కిషన్ అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల పరిషత్ 7వ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సింగరికి కిషన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా ఖానాపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ కడార్ల గంగానర్సయ్య హాజరైనారు. నల్గొండ జిల్లా నాగార్జున్ సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సిం హ్మయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో 2నిమిషాల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు మౌనం పాటించారు. ఆ తర్వాత వ్యవసాయ కమిటీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు చాలా నష్టం జరుగుతోందన్నారు. వ్యవసాయ మార్కెట్ చెక్పోస్టులను తొలగించారని, దీంతో ఆదాయం ఏమీ లేకుండా పోయిందని అన్నారు. అనంతరం 21 అంశాల ఎజెండా శాఖలపై చర్చించారు. ముందుగా విద్యాశాఖకు సంబంధించిన సమాచారాన్ని మండల విద్యాధికారి నేత గోపాల్ వివరించారు. కరోనా వ్యాప్తి ఉన్నందున విద్యాశాఖ పాఠశాలలు ప్రారంభించలేదు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుం డా ఆన్లైన్ క్లాసులను ప్రారంభించిందని తెలిపారు. 50శాతం ఉపాధ్యాయులతో ఆన్లైన్ క్లాస్పై ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలిస్తున్నారన్నారు. వైద్య ఆరోగ్య విస్తరణ అధికారి మాట్లాడుతూ మండలంలో 3482 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, అందులో 203 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపా రు. గ్రామాలలో కోవిడ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐకేపీ ఏపీఎం మాట్లాడుతూ ఐకేపీ ఆధ్వర్యంలో 6 గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశామన్నారు. సన్నరకం తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పశుసంవర్థక శాఖ వైద్యాధికా రి సుకన్య మాట్లాడుతూ గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులను వేస్తున్నట్లు కార్యక్రమం వారం రోజుల పాటు ఉంటుందని తెలిపారు. పౌర సరఫరాల శాఖపై డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారివి డీఎస్వో దగ్గర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఐసీడీఎస్ అంశంపై సూపర్వైజర్ చిత్రకళ మాట్లాడుతూ మండలంలో 25 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 17 పక్క భవనాలు లేవని 8 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే పక్క భవనాలు ఉన్నాయని తెలిపారు. 272 మంది గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నారు అని తెలిపారు. కోవిడ్ కారణంగా గుడ్లు, సరుకులను పిల్లల ఇంటికి, గర్భిణులు, బాలింతల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్న ట్లు తెలిపారు. ఉపాధి హమీ ఏపీవో రవి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో 2843 మరుగుదొడ్లు మంజూరు కాగా, 2309 మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శారద, వైస్ ఎంపీపీ భుక్య రాజునాయక్, ఎంపీడీవో ఆర్ల గంగాధర్, ఎంపీవో అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కవిత, ఎంపీటీసీలు, దస్తూరాబాద్ సర్పంచ్ నిమ్మతోట రాజమణి, సర్పంచ్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బిల్లులు చెల్లించాలని సర్పంచ్ల ధర్నా
కాగా, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో నిర్మించిన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతల బిల్లులు అధికారుల నిర్లక్ష్యంతో ఎంబీఈలు రాయగా.. బిల్లులు రావడం లేదని మండలంలోని 13 గ్రామాల సర్పంచ్లు వాపోయారు. మండల సర్వసభ్య సమావేశం మధ్యలో బైకాట్ చేసి నిరసన వ్యక్తం చేసి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు చెప్పినట్లు గ్రామాలలో అభివృద్ధి పనులు చేశామని, ఆ పనులు ఎంబీఈలు చేయకపోవడంతో బిల్లులు రావడం లేదని, దీంతో అప్పుల పాలు అవుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంపీపీ సింగరి కిషన్, ఎంపీడీవో గంగాధర్లు అధికారులతో మాట్లాడి నచ్చచెప్పడంతో సర్పంచ్లు సమావేశానికి తిరిగి హాజరయ్యారు.